Advertisement

టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో లీడర్...!

By: Anji Sun, 27 Sept 2020 2:12 PM

టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో లీడర్...!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా.. తాజాగా, మరో కీలక నేత, దివంగత ఎన్టీఆర్‌కు సన్నిహితుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు గద్దె బాబూరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో పరిస్థితులు బాగోలేవని, సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మ గౌరవం, ఆత్మస్థైర్యంతో పుట్టిన తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం కరుమరుగైందని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు పార్టీ వేరని, ప్రస్తుతం వేరని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. 1978లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తాను, ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో చేరానని, అప్పటి నుంచి ఆయన అడుగు జాడల్లో నడిచానని బాబూరావు తెలిపారు.

అప్పట్లో ఎన్టీఆర్‌ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఎమ్మెల్యే స్థానాల బీ ఫారాలు తన చేతికే ఇచ్చేవారని, కానీ అప్పటి టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడాలు వచ్చాయన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకూ తాను ఉన్నానో లేనో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మానేసిందని గద్దె బాబూరావు వాపోయారు.

తనకు ఎవరి మీద విమర్శలు చేయడం ఇష్టం లేదని, ఆత్మ గౌరవం, ఆత్మ సంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా పని చేశారు.

Tags :
|

Advertisement