సుశాంత్ డెత్ కేసును సిబిఐ తో విచారణ చేయించాలి ...బీఎస్పీ చీఫ్ మాయావతి
By: Sankar Thu, 30 July 2020 3:54 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజు రోజుకు మురికిగా మారుతోందని బీఎస్పీ చీఫ్ మాయావతి గురువారం అన్నారు. సుశాంత్ జూలై 14న ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లోని ఉరి వేసుకొని మృతి చెందగా, అప్పటి నుంచి ముంబై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని కేసులో ప్రశ్నించారు.
తాజాగా రియా చక్రవర్తి కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై మాయావతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ కేసులో దర్యాప్తు నిర్వహించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని సూచించారు. బీహార్ మూలానికి చెందిన యువ నటుడు సుశాంత్ మరణం కేసులో ప్రతి రోజు కొత్త వాస్తవాలు వెలుగు చూస్తున్నాయన్నారు. దీనిపై మహారాష్ట్ర, బీహార్ పోలీసులకు బదులుగా సీబీఐతో దర్యాప్తు చేస్తే మంచిదన్నారు.
కాగా, సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు నటి రియా చక్రవర్తితో పాటు మరో ఆరుగురిపై పలు సెక్షన్ల కింద ఆత్మహత్య, మోసానికి సంబంధించిన కేసులతో సహా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాట్నా జోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్సింగ్ పేర్కొన్నారు. ‘సుశాంత్ రాజ్పుత్ సంఘటనలో మహారాష్ట్ర, బీహార్ నాయకులు తీసుకున్న భిన్న వైఖరి వారి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే వారి అసలు ఉద్దేశంగా అనిపిస్తుంది.
ఇది సముచితం కాదని, మహారాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలి’ అని మాయావతి అన్నారు. యువ నటుడి అకాల మరణానికి కారణాలు తెలుసుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు, మహేశ్ భట్, సంజయ్లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా తదితరులను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో కేసు కొత్త మలుపు తిరిగింది.