జూన్లో బీజింగ్లో కొత్తగా 300 కేసులు నమోదు
By: chandrasekar Sat, 04 July 2020 12:01 PM
చైనాలోని వుహాన్లో
పుట్టిన ఈ ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ అనే
మాట వినబడితే చాలు గుండెలు జారిపోతున్నాయి. చైనాలో గత డిసెంబర్లో పుట్టిన ఈ వైరస్
ఆ దేశంలో బీభత్సం చేసింది. వైరస్ బారినపడి పిట్టల్లా రాలిపోతుంటే జనం బెంబేలెత్తిపోయారు.
ఇళ్లలో నుంచి అడుగు
బయటపెట్టడానికే భయపడ్డారు. అయితే కట్టుదిట్టమైన చర్యలతో చైనా ఈ మహమ్మారిని
నియంత్రించగలిగింది. వుహాన్ మాదిరిగా ఇతర ప్రాంతాల్లో వైరస్ విజృంభించకుండా కట్టడి
చేయగలిగింది. 72 రోజుల లాక్డౌన్ తర్వాత మెల్లిగా అన్ని
కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇతర దేశాల నుంచి
తిరిగొస్తున్న వారితో చైనాలో కొత్తగా కేసులు నమోదవుతున్నాయి.
జూన్లో బీజింగ్లో
కొత్తగా 300
కేసులు నమోదయ్యాయి. నగరంలోని ఓ మాంసం మార్కెట్ వైరస్ వ్యాప్తికి కేంద్రమైంది. ఈ
నేపథ్యంలో బీజింగ్లో మళ్లీ అలజడి మొదలైంది. బీజింగ్లోని షిజింగ్షాన్ వాండా
ప్లాజాకు వెళ్లిన యువతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో మాట్లాడుతూనే ఆ యువతి
కుప్పకూలి గుండె పగిలేలా రోదించింది. తన వద్దకు ఎవరూ రావొద్దంటూ అరుస్తూ, పిచ్చిపట్టిన
దానిలా ఏడ్చింది. ఆమెకు ఏమైందో అని అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా చూశారు. కాసేపటి
తర్వాత వారికీ విషయం అర్థమైంది. అదే ఆమెకు కరోనా పాజిటివ్. కొన్ని నెలలుగా చైనాను
వణికిస్తున్న కరోనా వైరస్ తనకూ సోకిందని తెలియగానే ఆమెకు గుండె ఆగినంత పనైంది.
కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది.
యువతికి కరోనా పాజిటివ్
అని తెలియగానే వాళ్లు అక్కడున్న వాళ్లందరూ ఆమె నుంచి దూరంగా పరుగెత్తారు. కాసేపటి
తర్వాత ఆ యువతి దుఃఖాన్ని దిగమింగుకొని ప్లాజా ఎంట్రీ పాయింట్ దగ్గర అందరికీ
దూరంగా కూర్చుంది. ఇంతలో పీపీఈ కిట్లు ధరించి వచ్చిన ఆరోగ్య సిబ్బంది ఆమెను
అంబులెన్స్లో తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి.