ఇంటి అద్దె చెల్లించడంలేదు అని ఎస్సై కొట్టడంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
By: Sankar Mon, 03 Aug 2020 12:31 PM
తమిళనాడులోని చెన్నైలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ కొట్టడంతో మనస్థాపానికి గురైన కిరాయిదారు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా శ్రీనివాసన్ అనే చిత్రకారుడికి పని లేకుండా పోయింది. గడిచిన నాలుగు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. దీంతో యజమాని ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా కోరాడు.
శ్రీనివాసన్ తనకు కొన్ని రోజులు సమయం కావాలని కోరగా.. లేదు ఇప్పుడే ఖాళీ చేయాలని యజమాని ఆదేశించాడు. ఇప్పటికిప్పుడు తాను ఖాళీ చేయలేనని తేల్చి చెప్పడంతో యజమాని పోలీసులను పిలవగా ఎస్ఐ వచ్చి శ్రీనివాసన్ను కొట్టాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు గుర్తించి దవాఖానకు తరలించగా 80 శాతం గాయాలతో శ్రీనివాసన్ మృతి చెందాడు. ఈ కేసులో ఇన్స్పెక్టర్ సామ్ బెన్సన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు