ఐపీఎల్ తర్వాత ధోనీకోసం వీడ్కోలు మ్యాచ్ - బీసీసీఐ సన్నాహాలు
By: Dimple Wed, 19 Aug 2020 11:02 PM
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని సమాచారం. భారత క్రికెట్కు ఎనలేని సేవ చేసిన మహీని సత్కరించడం గౌరవమని భావిస్తున్నారని తెలిసింది. ఐపీఎల్-2020 ముగిశాక జరిగే అంత్జాతీయ సిరీస్లో ఆడించాలని అనుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
‘ఇప్పుడే అంతర్జాతీయ సిరీసులేమీ లేవు. ఐపీఎల్-2020 తర్వాత మేం ఏం చేయగలమో చూస్తాం. ఎందుకంటే దేశానికి ధోనీ ఎంతో చేశాడు. అతడు సత్కారానికి అర్హుడు. ఆయనకు కచ్చితంగా వీడ్కోలు మ్యాచ్ ఉండాలనే మేం భావించాం. కానీ మహీ భిన్నమైన ఆటగాడు. ఎవరూ ఊహించకుండా హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు’ అని బీసీసీఐలోని ఓ అధికారి మీడియాతో చెప్పారు.
ఇప్పటికైతో ధోనీతో మాట్లాడలేదు. ఐపీఎల్ జరిగేటప్పుడు మాట్లాడతాం. మ్యాచ్ లేదా సిరీస్ నిర్వహణపై అతడి అభిప్రాయం తీసుకోవడానికి అదే సరైన సమయం. అతడు అంగీకరించినా లేకపోయినా కచ్చితంగా సన్మానం చేస్తాం. అతడిని సత్కరించడం మాకు గౌరవం’ అని ఆ అధికారి అన్నారు. దిగ్గజ క్రికెటరైన ధోనీకి ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ మదన్లాల్ సైతం అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఎంతోమంది అభిమానులు ఆఖరి మ్యాచ్లో మహీని చూడాలని కోరుకుంటున్నారు.