ఐపీఎల్ షెడ్యూలు ఖరారుకు బీసీసీఐ తర్జన భర్జన
By: Dimple Fri, 28 Aug 2020 01:06 AM
ఐపీఎల్ మ్యాచుల షెడ్యూలును ఖరారు చేయడానికి బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికార యంత్రాంగంతో చర్చించి... నిబంధనలు సడలించాలని బీసీసీఐ, ఐపీఎల్ ఉన్నత అధికారవర్గం ప్రయత్నిస్తోంది. దుబాయిలో బస చేస్తున్న రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు క్రికెట్ మైదానాల్లోకి రాకపోకలు సాగించడానికి ఎలాంటి ఇబ్బందుల్లేవు. దుబాయ్ నుంచి షార్జాకి, షార్జా నుంచి దుబాయికి యధేచ్చగా రాకపోకలు సాగించవచ్చు. అయితే.... అబుదాబి నగరం చేరుకోడానికి నిబంధనలు ఆటంకంగా మారాయి.
సముద్ర తీరాన ఉన్న షార్జా, దుబాయి క్రికెట్ స్టేడియాల మధ్య 48 కిలోమీటర్ల దూరం ఉంది. బస్సుల్లో క్రికెట్ స్టేడియం చేరుకోడానికి ఏజట్టు అయినా కేవలం అర్థగంటలో చేరుకునే వెసులుబాటు ఉంది. దీంతో దుబాయి, షార్జా క్రికెట్ స్టేడియాలపరిసరాల హోటళ్లలో బస చేస్తున్న ఆరు ఐపీఎల్ జట్లకు ఇబ్బంది లేదని సమాచారం.
అబుదాబిలో ఉంటున్న కోల్కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు... దుబాయి, షార్జా చేరుకోడానికి ఇబ్బందికర పరిస్థితులు కన్పిస్తున్నాయి.
ఇక్కడ షార్జా క్రికెట్ స్టేడియం నుంచి... అబుదాబి క్రికెట్ స్టేడియంకి 158 కిలోమీటర్ల దూరం ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి అబుదాబికి 117 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే దూర ప్రయాణం సమస్యకాదు.... స్థానికంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం నగరాల మధ్య ఏర్పరచుకున్న కోవిడ్19 నిబంధనలు, ప్రొటోకాల్ నిబంధనలు... ఐపీఎల్ ఆటగాళ్లకు ఇబ్బందికరంగా పరిణమించాయి.
దీంతో ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పాటిల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారుల సాయంతో లోకల్ అథారిటీని సంప్రదించి నిబంధనల సడలింపుకోసం అభ్యర్థించారు. బయో బబుల్లో ఉన్న ఆటగాళ్ల దృష్ట్యా కోవిడ్ నియమావళితోపాటు... ప్రొటోకాల్ నిబంధనలను 24 గంటల్లో సడలించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. సానుకూల నిర్ణయం రాకుండా... అక్కడి అధికార యంత్రాంగ సమ్మతించని పక్షంలో ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు.
ఐపీఎల్ మ్యాచులకు... లీగ్ దశలో రాకపోకల సమస్య ఒక ఎత్తైతే.... లీగ్ దశ తర్వాత ప్లే ఆఫ్ మ్యాచులు... ఫైనల్ మ్యాచులకోసం దుబాయ్ తిరిగి రావాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ షెడ్యూలుకు తుది మెరుగులు దిద్దాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికార యంత్రాంగం సానుకూలంగా స్పందించకపోతే... ఐపీఎల్ మ్యాచుల్ని రెండు విభాగాలుగా రూపొందించి... నాలుగు జట్లకు 28 మ్యాచులతో ఓ లీగ్... మరో నాలుగు జట్లకు మరో 28 మ్యాచులతో ఓ లీగ్ వేర్వేరుగా నిర్వహించి .. ప్లే ఆఫ్.. బెర్తు దక్కించుకున్న జట్లలో ఫైనల్ కు తలపడే జట్లను ఎంపిక చేసే విధంగా షెడ్యూలు రూపొందించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ప్రొటోకాల్ నిబంధనలు సడలిస్తే మాత్రం యధాప్రకారం.... ఒకే లీగ్ షెడ్యూలుతో 56మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
రాహుల్కు కాంగ్రెస్ సీనియర్ల వెన్నుపోటు
పార్టీకి పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ సోనియా గాంధీకి 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై శివసేన స్పందించింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని ఆరోపించింది. రాహుల్ గాంధీపై బీజేపీ చవకబారు వ్యాఖ్యలు, దాడులు చేసినప్పుడు వీరంతా ఎక్కడున్నారని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ వైదొలగిన అనంతరం పార్టీని పునరుద్ధరించే సవాల్ను వీరు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది.
రాహుల్ నాయకత్వాన్ని తుదముట్టించేందుకే వీరు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించింది. ఈ పాతకాపులు రాహుల్ గాంధీని వెన్నుపోటుపొడిచారని, బీజేపీ తలపెట్టని హాని సైతం వీరు రాహుల్కు తలపెట్టారని దుయ్యబట్టింది. వీరిలో చాలామందికి జిల్లా నేతల స్ధాయి కూడా లేకున్నా గాంధీ, నెహ్రూ కుటుంబాల అండతో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారని శివసేన వ్యాఖ్యానించింది. అన్ని రాష్ట్రాల్లోనూ దిగ్గజ నేతలు పార్టీ పట్ల ఆసక్తి చూపకుండా కేవలం తమ పదవుల పట్లే ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. పదవులు రానివారంతా బీజేపీ వైపు మళ్లుతున్నారని, ఈ పరిస్ధితుల్లో రాహుల్, సోనియా ఏం చేస్తారని ప్రశ్నించింది. పదవులు రాకుంటే పార్టీలు మారడం కొత్తతరహా రాజకీయ కరోనా వైరస్గా పరిణమించిందని వ్యాఖ్యానించింది.
మహారాష్ట్రలో బీజేపీతో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఉద్థవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా సోనియాకు సీనియర్ నేతల లేఖపై కాంగ్రెస్లో పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే. సీనియర్ నేతల లేఖపై సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అసంతృప్త నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించడంతో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి నేతలు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఇక సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆ తర్వాత రాహుల్ వివరణ ఇవ్వాల్సివచ్చింది. మరోవైపు పార్టీ తాత్కాలిక చీఫ్గా సోనియా గాంధీ కొనసాగుతారని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.