ఐపీయల్ నిర్వహించుకోండి ..అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం
By: Sankar Tue, 28 July 2020 1:27 PM
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణకి భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉండటంతో.. యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇటీవల కేంద్ర హోమ్, క్రీడల మంత్రిత్వ శాఖలకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభ్యర్థన పంపింది. తాజాగా రెండు శాఖల నుంచి ఆమోదం వచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు..
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్ తయారు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది ..
ఈ మేరకు నెల రోజుల ముందే టీమ్స్ని అక్కడికి పంపించి.. 14 రోజులు క్వారంటైన్.. ఆ టైమ్లోనే రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనుంది. మొత్తంగా.. 51 రోజుల విండోలో 60 మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత పూర్తి స్థాయిలో మ్యాచ్ల షెడ్యూల్ని బీసీసీఐ ప్రకటించనుంది.