Advertisement

ఐపీయల్ 2020 నిర్వహణపై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ

By: Sankar Thu, 02 July 2020 9:28 PM

ఐపీయల్ 2020 నిర్వహణపై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ



కరోనా తగ్గినా, తగ్గకున్నా.. ఐపీఎల్ మాత్రం కచ్చితంగా నిర్వహించేలా ఉంది బీసీసీఐ. ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఐపీఎల్-2020 సీజన్ కరోనా మహమ్మారి వల్ల నిరవధికంగా వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ కరోనార్పణం అయినట్లేనని సగటు క్రికెట్ అభిమాని ఓ నిర్ణయానికొచ్చేశాడు. అయితే బీసీసీఐ మాత్రం వారిలో ఆశలను చిగురింపజేసేలా అప్పుడప్పుడూ కొన్ని ప్రకటనలను విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా నేడు కూడా ఓ ప్రకటన చేసింది. అయితే ఈ సారి కచ్చితమైన ప్రకటన చేసింది. భారత్‌లో కుదరకపోతే పక్కదేశాల్లోనైనా ఐపీఎల్-2020 నిర్వహిస్తామని, అందుకు అవసరమైన అన్ని మార్గాలను వెదుకుతున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో పక్కదేశాల్లోనైనా ఈ సీజన్ నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికోసం శ్రీలంక, యూఏఈ దేశాలను ముందుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే నిర్వహణకు సంబంధించిన తేదీలను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే దాదాపు 4 నెలలుగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ ఈ ప్రకటన చేసి వారికి పెద్ద తీపికబురు అందించింది.

అయితే ఇండియాలో కరోనా కేసులతో ఐపీయల్ వాయిదా పడటంతో శ్రీలంక తాము ఐపీయల్ ను నిర్వహిస్తామని ముందుకు వచ్చింది ..శ్రీలంకలో కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో శ్రీలంక ముందుకు వచ్చింది ..అలాగే యూఏఈ కూడా తాము కూడా ఐపీయల్ నిర్వహించేందుకు సిద్ధం అని తెలిపింది ..మరి బీసీసీఐ ఈ రెండు దేశాలలో ఎక్కడ నిర్వహిస్తదో తెలియాలి అంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే ..

Tags :
|

Advertisement