Advertisement

  • దీపావళి పండగ వేళ టపాసులపై నిషేధం...కేజ్రీవాల్ కీలక నిర్ణయ౦...

దీపావళి పండగ వేళ టపాసులపై నిషేధం...కేజ్రీవాల్ కీలక నిర్ణయ౦...

By: chandrasekar Fri, 06 Nov 2020 04:01 AM

దీపావళి పండగ వేళ టపాసులపై నిషేధం...కేజ్రీవాల్ కీలక నిర్ణయ౦...


ఢిల్లీ కరోనా కేసులతో పాటు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దీపావళి పండగ వేళ టపాసులపై నిషేధం విధించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దీపావళి లక్ష్మీ పూజ నిర్వహిస్తామని అందరూ లైవ్ ద్వారా పాల్గొనాలని కోరారు. మరోవైపు.. దీపావళి రోజున పశ్చిమ బెంగాల్‌లో టపాసులు కాల్చడంపై కోల్‌కతా హైకోర్టు నిషేధం విధించింది. క్రాకర్స్ విక్రయం, కాల్చడంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో కరోనా పరిస్థితి, సన్నద్ధతపై గురువారం సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. పండుగ సీజన్‌ కావడం, కాలుష్యం పెరగడమే ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభణకు కారణంగా భావిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి తగిన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలను పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా టెస్ట్ లను మరింత పెంచాల్సిందిగా అధికారులకు సూచించినట్లు అన్నారు.

‘ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఎవరూ టపాసులు కాల్చొద్దు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈసారి లక్ష్మీ పూజ నిర్వహిస్తాం. అందరం కలిసి దీపావళి జరుపుకొందాం. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దీపావళి (నవంబర్‌ 14) రోజున 2 కోట్ల మంది ఢిల్లీ ప్రజలంతా రాత్రి 7.39 గంటలకు తమ ఇళ్లల్లో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని చూడాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పూజలో పాల్గొనాలి’ అని కేజ్రీవాల్ కోరారు. ఐసీయూ బెడ్స్ పెంపునకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపిన సీఎం కేజ్రీవాల్ దీనిపై సుప్రీంకోర్టులో శుక్రవారం అప్పీల్‌కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది కూడా బాణసంచా కాల్చకుండానే దీపావళి పండుగ జరుపుకొన్నామని సీఎం కేజ్రీవాల్ గుర్తుచేశారు. అదేవిధంగా ఈసారి కూడా జరుపుకోవాలని నగర ప్రజలను కోరారు. వాయు కాలుష్యం, కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో క్రాకర్స్ కాల్చడం పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తుందన్నారు.

‘పొగ కారణంగా ఢిల్లీలో మరణాలు సంభవించే ఘటనలకు ఇదే చివరి ఏడాది కావాలి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానాలో రైతులు వరి దుబ్బులను తగులబెట్టడం వల్ల ఢిల్లీలో గాలి కాలుష్యం పెరుగుతోందని సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. తాజాగా కరోనా కేసులు పెరగడానికి కూడా ఇదే ప్రధాన కారణమని వివరించారు. ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్నట్టుగానే అన్ని రాష్ట్రాలు తమ రైతులకు సాయం చేయాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో బుధవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. 6842 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్ కారణంగా 51 మంది మరణించారు. ఢిల్లీలో ప్రస్తుతం 37,369 యాక్టవ్‌ కేసులు ఉన్నాయి.

Tags :
|

Advertisement