బండి సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
By: Sankar Tue, 29 Dec 2020 1:15 PM
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ మీద ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన చేస్తున్న ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్.. ఆయన స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
నీ పదవి కూడా కేసీఆర్ భిక్షే అని విమర్శించారు. ప్రజలు నిన్ను కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే నీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశావని నిలదీశారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలోనే ఆపించే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్ను నిందించారు.
దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారని వ్యాఖ్యానించారు. మేమూ నీలాగా చిల్లరగా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు