ఎట్టి పరిస్థితిలోనూ రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని బాలినేని స్పష్టం
By: chandrasekar Thu, 03 Sept 2020 5:05 PM
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు విద్యుత్ సంస్కరణల విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, లేనిపోని అపోహలు సృష్టించవద్దని ఆ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలపై బుధవారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఉచిత విద్యుత్కి ఎలాంటి ఆటంకం కలగదన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ రైతులు డబ్బు కట్టే పరిస్థితి రాదని బాలినేని స్పష్టం చేశారు. రైతులు ఒక్క రూపాయి కట్టే పరిస్థితి వచ్చినా తన మంత్రి పదవి వదులుకుంటానని సవాల్ చేసారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని మంత్రి బాలినేని అన్నారు. ఆనాడు ఉచిత విద్యుత్ గురించి వైఎస్సార్ మాట్లాడితే తీగల మీద బట్టలు ఆరవేసుకోవాల్సిందే అని చంద్రబాబు ఎద్దేవా చేశారని, విద్యుత్ గురించి మాట్లాడితే హైదరాబాద్ బషీర్బాగ్లో రైతులపై కాల్పులు జరిపించారని ప్రతిపక్ష నేత చంద్రబాబుదనాయుడుపై వ్యాఖ్యలు చేసారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని తెలియచేశారు. రైతుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమచేసి ఆ బిల్లు డబ్బును డిస్కం ఖాతాలో జమచేయడం ద్వారా రైతులకు ఎలాంటి నష్టం ఉండదని మంత్రి బాలినేని తెలియచేసారు. కాగా, దివంగత ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతుల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఈ పథకం ద్వారా ఇంతకాలం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఇక నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. వారి ద్వారానే ఆ డబ్బు డిస్కమ్లకు చేరుతుంది. ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.