ప్రేమలో విఫలం అయి బి.టెక్ విద్యార్థి ఆత్మహత్య..
By: Sankar Mon, 14 Sept 2020 11:00 AM
ప్రేమలో విఫలం చెందినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. తన ప్రేయసి మోసం చేసిందనే ఆవేదనతో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. అంతేకాక, చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని ఎవరినీ ప్రేమించవద్దని తన ఈడు యువకులకు హితవు పలికాడు. చచ్చేదాకా మనతో ఎవరుంటారో వారినే ప్రేమించాలని సూచించాడు. తన ఫ్రెండ్స్, బంధువులకు వీడ్కోలు చెబుతూ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలచివేసింది.
కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి 3 రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకొని, ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచాడు.
కొద్ది నెలల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించిన సాయి.. ఆ అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోకపోవడంతోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు అతని సెల్ ఫోన్ను పరిశీలించగా, పురుగుల మందు తాగకముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడింది. దీంతో అతని చావుకు కారణం ప్రేమ అని తెలిసింది. ఈ ఘటనతో సాయి కుటుంబ సభ్యులు, మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు