భారత జట్టు కోచ్ గా అవకాశం వస్తే వదులుకోను ..మాజీ టీమిండియా కెప్టెన్
By: Sankar Tue, 16 June 2020 08:17 AM
భారత్ జట్టుకి కోచ్గా అవకాశమొస్తే అస్సలు వదులుకోనని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ వెల్లడించాడు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న అజహరుద్దీన్.. టీమిండియాకి శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువ సిబ్బంది ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చీఫ్ కోచ్కి బ్యాటింగ్లో నైపుణ్యం ఉన్నప్పుడు.. మరి ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరమేంటి..? అని అజ్జూ ప్రశ్నించాడు.
టీమిండియాకి కోచ్గా పనిచేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. అయితే.. టీమ్కి శిక్షణ ఇచ్చేందుకు అంతమంది కోచింగ్ స్టాఫ్గా ఉండటం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ఉదాహరణకి నాకు బ్యాటింగ్, ఫీల్డింగ్లో మంచి నైపుణ్యం ఉంది. కాబట్టి.. నేను హెడ్ కోచ్ అయితే.. నాకు బ్యాటింగ్ కోచ్ అవసరం ఉండదు. అంతే కదా..?’’ అని అజహరుద్దీన్ వెల్లడించాడు. ప్రస్తుతం టీమిండియా చీఫ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి.. 2021 వరల్డ్కప్ వరకూ ఆ బాధ్యతల్లో ఉండనున్నాడు.
భారత టెస్టు జట్టులోకి 21 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన మహ్మద్ అజహరుద్దీన్.. ఆడిన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్.. 2000లో ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆ ఏడాది జరిగిన సిరీస్లో కొన్ని మ్యాచ్లు ఫిక్సింగ్కి గురవగా.. అందులో అజహరుద్దీన్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దక్షిణాఫ్రికా అప్పటి కెప్టెన్ హాన్సీ క్రోన్జ్తో కలిసి బుకీలతో అజహరుద్దీన్ చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి.