దేశ ప్రజలు ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం ప్రారంభం అయింది
By: Sankar Thu, 20 Aug 2020 4:28 PM
దేశప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూసిన రామ మందిర నిర్మణానికి సంబంధించి ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు మట్టిని పరీక్షిస్తున్నారు. 36 నుంచి 40 నెలల కాలంలో ఆలయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ ట్వీట్ చేసింది. ‘మన పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం జరుగుతుంది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాము. మందిర నిర్మాణంలో ఉక్కును వాడటం లేదు’ అంటూ ట్వీట్ చేసింది.