బలగాలను వెనక్కు మళ్లించేందుకు సిద్ధంగా లేదని అధికార వర్గాల ప్రకటన
By: chandrasekar Fri, 19 June 2020 11:40 AM
చైనా సైనికులు దాడికి
పాల్పడి 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకోవడంతో భారత్ ఈ
విషయాన్ని తేలిగ్గా తీసుకోబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన విషయం
తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తన
బలగాలను వెనక్కు మళ్లించేందుకు సిద్ధంగా లేదని అధికార వర్గాలు తెలిపారు.
దీర్ఘకాలిక సరిహద్దు నిర్వహణ విధానంలో భాగంగా భారత్ ఎప్పుడూ శాంతి, ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం చేస్తుందని
వ్యాఖ్యానించాయి.
ప్రస్తుతం చైనా
రెచ్చగొట్టే ధోరణితో ముందుకెళుతోందని, ఈ
విషయంలో తాము కూడా వెనకడుగువేయబోమని భారత్ స్పష్టం చేస్తోంది. ‘సరిహద్దుల్లో
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) ముందుకొచ్చే రోజులు ముగిశాయి’ అని ఉన్నతాధికార
వర్గాలు తెలిపాయి.
భారత సైనికులపై దాడిచేసి
రక్తపాతం సృష్టించిన తర్వాత ఎల్ఏసీ వెంబడి 3,488
కిలోమీటర్ల మేర తూర్పు సముద్ర తీరంలో అత్యున్నత హెచ్చరికలను కొనసాగుతోందన్నాయి.
చైనా కూడా తన బలగాలను
మోహరించింది. ముఖ్యంగా తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయ, దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్పాంగ్, చుషుల్ వద్ద సైనిక బలగాల మోహరింపు కొనసాగుతోంది.
భారత్ మాత్రం లడఖ్ నుంచి
అరుణాచల్ ప్రదేశ్ వరకు పూర్తిగా చైనా సరిహద్దు వెంట దాదాపు యుద్ధానికి
సన్నద్ధమయ్యింది. తూర్పు లడఖ్లో ఇప్పటికే 15వేల
మంది సైనికులను భారత్ ఇప్పటికే మోహరించిన విషయం తెలిసిందే.
‘మన సైనికులు వెనక్కి
వెళ్లరు. మన ప్రాదేశిక సమగ్రతపై రాజీ ఉండదు. కార్టోగ్రాఫిక్ వ్యూహాన్ని చాలా కాలం
చైనా అనుసరించింది. వారు మన భూభాగంలోకి ప్రవేశించి, ఏకపక్షంగా వాదనలు చేస్తారు. అవి నిజమని పునరావృతం
చేస్తూ ఆపై భారత్ తమ భూభాగంలోకి ప్రవేశించిందని చిత్రీకరిస్తారు’ అధికార వర్గాలు
వ్యాఖ్యానించాయి. ఇది ఎల్లకాలం చెల్లదని, భూభాగాన్ని
స్వాధీనం చేసుకునే ప్రతి ప్రయత్నంలోనూ చైనా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని
అన్నారు. సరిహద్దు ఘర్షణపై సౌత్ బ్లాక్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమై సమీక్షించిన
తర్వాత అధికార వర్గాలు ఈ వ్యాఖ్యలు చేశాయి.