ఇంగ్లాండ్ పై సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా
By: Sankar Thu, 17 Sept 2020 11:32 AM
క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు ఎంత పటిష్ట జట్టు అనేది మరొక సారి నిరూపితం అయింది..100 లోపే అయిదు వికెట్లు కోల్పోయిన కూడా 300 పైచిలకు పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఇంగ్లాండ్ గడ్డ మీద వన్ డే సిరీస్ ను కైవసం చేసుకుంది.. ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగిన మూడవ వన్డేలో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది.
గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ కేరీల అద్భుత సెంచరీలతో ఆస్ట్రేలియా చివరి ఓవర్లో విజయం సాధించింది. ఈ ఇద్దరూ 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓ దశలో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే మ్యాక్స్వెల్ 108, క్యారీ 106 పరుగులతో ఆసీస్ను విజయతీరానికి చేర్చారు. చివరి ఓవర్లో పది పరుగులు అవసరం కాగా, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకున్నారు.
అయిదేళ్లుగా స్వదేశం వన్డే సిరీస్ను కోల్పోని ఇంగ్లండ్ ఈ ఓటమితో చేదు అనుభవం ఎదురైంది. అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జానీ బెయిర్స్టో 112 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 302 రన్స్ చేసింది. వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో సొంతం చేసుకున్నది.