దారుణం: భార్యను చంపేసి శవం పక్కనే వీడియో గేమ్ ఆడుతూ కూర్చొన్న భర్త...
By: chandrasekar Tue, 08 Dec 2020 6:52 PM
ఓ భర్త తన భార్యను
కత్తెరతో పొడిచి చంపాడు. అత్తమామలు, పోలీసులు వచ్చే వరకు రక్తపు మడుగులో ఉన్న ఆ శవం
పక్కనే వీడియో గేమ్ ఆడుకుంటూ రిలాక్స్ గా కూర్చుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్
లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ లోని బీజేఎస్
కాలనీ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్(35)
అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం శివ కన్వార్ అనే
మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొంత కాలం నుంచి విక్రమ్ ఏ పని
చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. అయితే అతని భార్య కుటుంబ పోషణకు మిషన్ కుట్టేది.
ఖాళీగా ఇంట్లోనే ఉంటున్న విక్రమం ఏ పని చేయకపోగా నిత్యం భార్యతో గొడవకు దిగేవాడు.
ఆదివారం సైతం విక్రమ్, అతని భార్యకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యపై
తీవ్ర ఆగ్రహంతో విక్రమ్ భార్యను కత్తెరతో పొడిచాడు. ఓ వైపు భార్య ప్రాణాలు
పోతున్నా పక్కనే కూర్చొని ఫోన్లో వీడియో గేమ్ ఆడడం ప్రారంభించాడు. ఆ ప్రాణాలు
పూర్తిగా పోయిన తరువాత తీరిగ్గా అత్తమామలకు ఫోన్ చేసి మీ కూతురును చంపేశానంటూ
చెప్పాడు. దీంతో వాళ్లు పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చే సరికి రక్తంలో పడి ఉన్న తమ
కూతురు పక్కన అల్లుడు వీడియో గేమ్ ఆడుకుంటూ కనిపించాడు.
నా బిడ్డను చంపేశావంటూ
వాళ్లు ఎంత తిట్టినా అతను ఏ మాత్రం పట్టించుకోకుండా వీడియో గేమ్ లోనే
మునిగిపోయాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం
అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. వాళ్లు వచ్చే సరికి
కూడా విక్రమ్ వీడియో గేమ్ ఆడుతూనే కదలకుండా కూర్చున్నాడు. అతడిని అరెస్టు చేసి
మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై
డీసీపీ ధర్మేంద్ర సింగ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే
విక్రమ్ అసంతృప్తిగా ఉండేవాడని తమ విచారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో అతను భార్యతో
నిత్యం గొడవపడే వాడన్నారు. అతనికి ఏమైనా మానసిక సమస్యలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం
చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.