అస్సాంలో ఇంటర్ విద్యార్థినులకు స్కూటీ బహుమతి
By: Dimple Thu, 20 Aug 2020 00:33 AM
అస్సాం రాష్ట్రంలో 12వ తరగతి (ఇంటర్మీడియెట్) పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ప్రోత్సాహకంగా స్కూటీ వాహనాలను అందచేయాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ‘ప్రజ్ఞాన్ భారతి’ పథకం కింద 22,000 విద్యార్థినులకు స్కూటీలను అందించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు. కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కోదాని విలువ రూ.50,000 పైగా ఉండొచ్చని తెలిసింది.
అయితే ఈ అవకాశం అసోం రాష్ట్ర ప్రభుత్వ సిలబస్లో చదివిన వారికి మాత్రమే వర్తిస్తుందని మంత్రి వివరించారు. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాసై, స్కూటీ కావాలనుకునే అసోం యువతులు sebaonline.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. వాహనాల పంపిణీ అక్టోబర్ 15లోగా పూర్తిచేస్తామని ఆయన వివరించారు. అంతేకాకుండా మూడు సంవత్సరాల లోపు వాటిని విక్రయించరాదని వెల్లడించారు.
కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ అసోం రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను విజయవంతంగా నిర్వహించటమే కాకుండా ఫలితాలను కూడా సకాలంలో ప్రకటించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉన్నత కళాశాలల్లో 25 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వ సిలబస్లో చదివిన విద్యార్థులకే కేటాయించాలని అక్కడి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.