Advertisement

  • రాహుల్ గాంధీ ఆరోపణలకు మద్దతిచ్చేలా అమెరికా మీడియాలో కథనాలు

రాహుల్ గాంధీ ఆరోపణలకు మద్దతిచ్చేలా అమెరికా మీడియాలో కథనాలు

By: chandrasekar Mon, 17 Aug 2020 7:58 PM

రాహుల్ గాంధీ ఆరోపణలకు మద్దతిచ్చేలా అమెరికా మీడియాలో కథనాలు


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు, భారత్ లో పేస్ బుక్ ను బీజేపీ ప్రభుత్వమే నియంత్రిస్తుందని సంచనల వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలకు మద్దతిచ్చేలా అమెరికా మీడియాలో కథనాలు వెలువడటం చర్చనీయాంశమవుతోంది. ఆగస్టు 15న దీనిపై ప్రఖ్యాత పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను పక్కన పెడుతున్న ఫేస్ బుక్.. కాంగ్రెస్ నేతలు ఒక్క చిన్న మాటన్నా, వాటిని విపరీతంగా ప్రచారం చేస్తోందని’ కథనంలో పేర్కొంది. ‘భారత రాజకీయాల్లో విద్వేష ప్రసంగాల విషయంలో నిబంధనలు మారాయి.. సంస్థ ప్రధాన అధికారి ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు’ అనే అర్థం వచ్చేలా రాసింది.

బీజేపీ నేతలు చేసే అభ్యంతరకర వ్యాఖ్యలను ఫేస్ బుక్ ప్రచారం చేయడం లేదని దుయ్యబట్టింది. ఈ విషయాన్ని భారత ఫేస్ బుక్ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఎత్తి చూపినా యాజమాన్యం పట్టించుకోలేదని, బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కథనాన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన రాహుల్ గాంధీ, భారత్ లో ఫేస్ బుక్, వాట్స్ యాప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎట్టకేలకు అమెరికా మీడియా సైతం గ్రహించిందని, ఫేస్ బుక్ గురించి అసలు నిజము ఇదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారి ప్రసంగాలు వైరల్ అవుతున్నాయని, మా ప్రసంగాలు మాత్రం బయటకు రావడం లేదని దుయ్యబట్టారు. రాహుల్ ఆరోపణలను సమర్దిస్తూ ఆ వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్.. ఓడిపోయిన వారు ప్రజలను మెప్పించలేక, ఇటువంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణమేనని, సోషల్ మీడియాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంత్రించడం అవాస్తవమని బదులిచ్చారు.

కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్ బుక్ లను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికలకు వెళ్లి ఓడిపోయి, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వారు ఇటువంటి ఆరోపణలే చేస్తారని మండిపడ్డారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలను వ్యతిరేకించిన ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ మిశ్రా, ఇప్పుడు మాట మార్చి, కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమ దిగ్గజాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణాన్ని వారు మరచినట్టున్నారని ఎద్దేవా చేయడం గమనార్హం. సోషల్ మీడియా యాజమాన్యం తన విశ్వసనీయతను కాపాడుకోడానికి విచారణ జరిపించి, అధికార పార్టీతో ఏదైనా సంబంధం ఉన్న ఫేస్ బుక్ ఇండియా సిబ్బందిని తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్, యుఎస్ లోని ఫేస్ బుక్ ఉన్నతస్థాయి వ్యక్తులకు దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు అందజేసినా, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ డేటా ఎనలిస్ట్ ప్రవీణ్ చక్రవర్తి, సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా వ్యాఖ్యానించారు.

Tags :

Advertisement