రైతులనే టార్గెట్ చేసుకుని వరుస చోరీలు చేస్తున్న దొంగల ముఠా అరెస్ట్...
By: chandrasekar Thu, 12 Nov 2020 10:21 PM
రైతులనే టార్గెట్
చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు
చేశారు. తాడికొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు
అర్బన్ ఎస్సీ అమ్మిరెడ్డి వివరాలు తెలిపారు. జిల్లాలోని ముప్పాళ్లకు చెందిన
ఒంటిపులి దుర్గారావు(22), గుంటూరు స్వర్ణభారతి నగర్కి చెందిన వేముల అంకయ్య(35), ప్రకాశం
జిల్లా నక్కబొక్కలపాడుకి చెందిన బండ బాలకృష్ణ(27)
ముఠాగా ఏర్పడ్డారు. రోడ్డుపై బైకులు ఉంచి పొలంలో
దిగిన రైతులనే టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలు చేస్తున్నారు. చోరీ చేసిన బైకుల
నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ ధరలకు విక్రయించేవారు. దొంగిలించిన బైకులను
గుంటూరులో దాచి ఆ తరువాత విక్రయించేవారు.
బైకు దొంగలపై నిఘా
పెట్టిన పోలీసులు తాడికొండ అడ్డరోడ్డు వద్ద ముగ్గురు అనుమానాస్పదంగా
తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు విషయం
వెలుగులోకి వచ్చింది. వారి నుంచి 46 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు
మార్చి అతి తక్కువ ధరలకు బైకులు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు
ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. నిందితులని పట్టుకున్న తాడికొండ
ఎస్సై, సిబ్బందిని
ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు.