ఏపీఎస్ ఆర్టీసీ సరుకు రవాణా ఛార్జీలకు సంబంధించి కీలక నిర్ణయం...
By: chandrasekar Mon, 30 Nov 2020 6:15 PM
ఏపీఎస్ ఆర్టీసీ సరుకు
రవాణా ఛార్జీలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సరకు రవాణా మరింత విస్తరించేందుకు
ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ
సరుకును రవాణా చేసేవారికి లబ్ధి చేకూరుతుందని ఆర్టీసీ పేర్కొంది.
చిరు వ్యాపారులు రైతులను దృష్టిలో
ఉంచుకుని ఛార్జీలను తగ్గించే నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 100 కి.మీ
లోపు సరుకు రవాణా ఛార్జీలు 50 శాతం వరకు సవరించారు. టన్నుకు 100 కి.మీ
లోపు రూ.వెయ్యి, 500 కిలోలకు 100 కి.మీలోపు వరకు రూ.500 మాత్రమే వసూలు చేస్తామని
ఆర్టీసీ పేర్కొంది.
మూడు టన్నుల కనీస లోడు
ఉంటే ప్రత్యేక వాహనం కేటాయిస్తామని తెలిపింది. సరుకు రవాణాలో టోల్ ఛార్జీలు, జీఎస్టీ
వసూలు ఉండవని.. సరుకు రవాణా ఏజెంట్లు ఆర్టీసీ కార్గో సర్వీస్లో బుక్ చేయొచ్చని
సూచించింది. అంతేకాకుండా ఆర్టీసీ కార్గోలో బుక్ చేస్తే నికర ఛార్జీపై ఐదు శాతం
కమిషన్ చెల్లింపు ఉంటుందని పేర్కొంది. బుకింగ్ కోసం ఆర్టీసీ డిపోలు, సరకు
రవాణా కౌంటర్లలో సంప్రదించాలని ఆర్టీసీ చెప్పింది. ఛార్జీల తగ్గింపుతో సరుకు రవాణా
చేసేవారికి భారీ ఊరట లభించింది .