సైనికుల మొబైళ్లలో పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్ లు తొలగించాలి
By: chandrasekar Fri, 10 July 2020 11:01 AM
పేస్ బుక్, ఇన్
స్టాగ్రామ్ వంటి యాప్ లు భారత సైనికుల మొబైళ్లలో ఇకపై కన్పించకూడదు. ఇండియన్ ఆర్మీ
విధించిన ఆ డెడ్ లైన్ లోగా యాప్ లను తొలగించుకోవల్సి ఉంటుంది. లేకపోతే క్రమశిక్షణా
చర్యలు ఉంటాయి. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్ వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ
నిర్ణయం తీసుకుంది.
ఇండియా చైనా సరిహద్దు
ఉద్రిక్తత నేపధ్యంలో టిక్ టాక్, షేర్ ఇట్, హెలో సహా మొత్తం 59 చైనా దేశపు యాప్ లను భారతదేశం నిషేధించిన సంగతి
తెలిసిందే. వీటిికి మరో 30 యాప్ లను కలిపి మొత్తం 89 యాప్
లను మొబైళ్ల నుంచి తొలగించాల్సిందిగా ఆర్మీ సైనికులకు స్పష్టమైన ఆదేశాలు జారీ
చేసింది. దీనికి జూలై 15 వ తేదీని డెడ్ లైన్ గా విధించారు.
గడువులోగా నిర్దేశించిన
యాప్ లను తొలగించకపోతే కఠిన చర్యలుంటాయని
సైతం హెచ్చరించింది. పాకిస్తాన్, చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆన్ లైన్ లో సైనికుల్ని
లక్ష్యంగా ఎంచుకున్న నేపధ్యంలోనూ, సమాచార భద్రత ఉల్లంఘన, హనీట్రాప్ ఘటనల కారణంగా ఈ
నిర్ణయాన్ని తీసుకుంది ఇండియన్ ఆర్మీ.
ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్
స్టాగ్రామ్ వంటి యాప్ లతో పాటు స్నాప్ చాట్, డైలీ హంట్, న్యూస్ డాగ్, ఐఎంవో, ట్రూ కాలర్ వంటివి ఉన్నాయి. గత సంవత్సరం అధికారిక
సమాచారం కోసం వాట్సప్ సైతం వినియోగించవద్దని సూచించిన సంగతి తెలిసిందే.
జమ్మూకాశ్మీర్ డీఎస్పీగా పనిచేసిన దేవేందర్ సింగ్ వ్యవహారం కూడా ఆర్మీ ఈ
నిర్ణయానికి కారణంగా ఉంది. దేవేందర్ సింహ్ టెర్రరిస్టులకు సహాయం చేస్తూ అడ్డంగా
దొరికిపోయిన సంగతి తెలిసిందే.