Advertisement

ఏపీలో కరోనా విలయ తాండవం.. తాజాగా 92 మంది మృతి

By: Sankar Tue, 25 Aug 2020 9:31 PM

ఏపీలో కరోనా విలయ తాండవం.. తాజాగా 92 మంది మృతి


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.. మంగళవారం కూడా మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు దాదాపు 10 వేలు నమోదయ్యాయి. అలాగే కరోనా బారిన పడి మరో 92 మంది మృత్యువాతపడ్డారు. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 64,351 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,927 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 3,71,659 కు పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో ఏకంగా 92 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,460కు పెరిగింది. ఇక, కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 16 మంది, అనంతపురంలో 11 మంది, కడపలో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పు గోదావరిలో 8 మంది, పశ్చిమ గోదావరిలో 8 మంది, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణాలో నలుగురు, విజయనగరంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

ఇక, మంగళవారం 9,419 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 3,71,639 పాజిటివ్ కేసులకు గాను, 2,78,247 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 89,932 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags :
|
|

Advertisement