ఏపీలో ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు !
By: Sankar Wed, 18 Nov 2020 5:35 PM
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండంతో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ద, న్యాయబద్ధమైన బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. ఇప్పటికే రాజకీయ పక్షాలతో ఎన్నికలపై చర్చించామని.. ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఖరారు చేస్తామని ఆయన అన్నారు. భవిష్యత్లో ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అని పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం ఏపీలో కరోనా అదుపులోకి వస్తోందని.. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిస్వార్ధంగా పని చేస్తున్నారని నిమ్మగడ్డ రమేష్ కొనియాడారు. గతంలో 10 వేల కేసులుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 753కి తగ్గిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతోనే ఇదంతా సాధ్యపడిందని నిమ్మగడ్డ ప్రసాద్ ప్రశంసించారు.