చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్
By: chandrasekar Tue, 07 July 2020 11:22 AM
అమరావతి ఆందోళనలు తాజాగా 200వ
రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఏపీలో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్గా
మారింది. ఈ సందర్భంగా నిరసన దీక్ష
చేపట్టిన చంద్రబాబు. రాజధాని అమరావతిపై అనేక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు.
అమరావతి అభివృద్ధికి 30
సంవత్సరాలు పడుతుందన్నారు. అమరావతి మీద వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి కక్షసాధింపు
లేదని స్పష్టం చేశారు అవంతి. చంద్రబాబు నాయుడు జూమ్ రాజకీయాలతో ఆర్గనైజ్ చేశారని
విమర్శించారు. లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు మంత్రి.
అమరావతి కావాలో విశాఖ కావాలో దమ్ముంటే నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
చూద్దాం అని మంత్రి అవంతి సవాల్ విసిరారు. అమరావతిపై సబ్బంహరి, పురందేశ్వరి
మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి అవంతి.
అమరావతి కోసం వారంతా
ముసలి కన్నీరు కాస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సబ్బంహరికి రాజకీయ భిక్ష
పెట్టింది విశాఖ ప్రజలు, రాజశేఖర్ రెడ్డి అని గుర్తుచేశారు అవంతి. సబ్బం హరి
జగన్ మీద ద్వేషంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2022లో అధికారం దిగి పోతారంటూ
చంద్రబాబు చెప్పారా? కేంద్రం చెప్పిందా? అంటూ సబ్బం హరి ఆత్మ
విమర్శ చేసుకోవాలని హితవు పలికారు మంత్రి. వైసీపీ మీద వివిధ వర్గాలు కలిసి సామూహిక
దాడి చేస్తున్నారని మండిపడ్డారు అవంతి శ్రీనివాస్.
బీజేపీ నేతలు ముందు
ఇచ్చిన హామీలు అమలు చేశారో.. లేదో చూసుకోవాలని వ్యాఖ్యానించారు. ఏమి కుట్ర ప్లాన్
చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఆగే
పరిస్థితి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.