స్వర్ణ ప్యాలస్ ఫైర్ యాక్సిడెంట్ ...రమేష్ బాబును విచారించేందుకు హైకోర్ట్ అనుమతి
By: Sankar Fri, 27 Nov 2020 4:52 PM
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. అతన్ని కస్టడియల్ విచారణకు అనుమతిని మంజూరు చేస్తూ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
దీంతో నిందితుడుని అదుపులోకి తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ పొలీసులు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు విచారించనున్నారు. రమేష్ బాబు న్యాయవాది పరివేక్షణలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ (రమేష్ హాస్పిటల్)లో మంటలు చెలరేగి 10 మంది చనిపోయి 20 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే..
కాగా స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి గవర్నర్పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేశ్బాబు, చైర్మన్ ఎం.సీతారామ్మోహనరావులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.