Breaking News: ఏపీ ఆరోగ్యశ్రీ ఆసుపత్రలకు హెచ్చరికలు జారీ..!
By: Anji Mon, 19 Oct 2020 5:40 PM
డబ్బులు కడితేనే చేర్చుకుంటామని చెబుతున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నెట్వర్క్ ఆసుపత్రులపై ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీరియస్ అయ్యింది. దీంతో ఆయా ఆసుపత్రలకు హెచ్చరికలు జారీ చేసింది. డబ్బులు తీసుకోవడం, క్యాష్ పేమెంట్ డిమాండ్ చేయడం వంటి పనులు చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే ఆరోగ్య శ్రీ ఉన్నా మొదట డబ్బులు కట్టాలని, తరువాతే రీయింబర్స్మెంట్ పెట్టుకోవాలని పలు ఆసుపత్రులు ఉద్యోగులకు సూచిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ స్పందించింది.
రోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే.. వారి నుంచి తీసుకున్న డబ్బులకు 10 రెట్లు ఎక్కువ పెనాల్టీ వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు అలాంటి ఆసుపత్రులను ప్రభుత్వం నుంచి లభించే అన్ని స్కీంల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తామని తెలిపింది.
కాగా ఈనెల 13న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు రూ.31.97 కోట్లు విడుదల చేసి ఆస్పత్రుల ఖాతాల్లో జమ చేసినట్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ ఎ.మల్లిఖార్జున వెల్లడించారు. ఇక మరికొన్ని రోజుల్లో మరో 16 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది.