Advertisement

టాక్సీవాలాలను ఆదుకోండి ..పవన్ కళ్యాణ్

By: Sankar Fri, 19 June 2020 7:37 PM

టాక్సీవాలాలను ఆదుకోండి ..పవన్ కళ్యాణ్



పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దు చేసి ట్యాక్సీల యజమానులను ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ మూలంగా అన్ని రంగాల మాదిరే ట్యాక్సీలు నడుపుకొంటూ జీవించేవారని, ఇప్పడు తీవ్ర కష్టాల్లో పడ్డారని పవన్ అన్నారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం జన జీవనం స్తంభించడంతో అద్దెకు వాహనాలు తిప్పే పరిస్థితి ఎలాగూ లేదని, సడలించిన తర్వాత కూడా ఉపాధి లభించే అవకాశాలు నామమాత్రమయ్యాయని పవన్ తెలిపారు.

ఇన్ని ఇబ్బందుల్లో ఉండగా ట్యాక్సీలకు రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు చెల్లించాలని రవాణా శాఖ ఒత్తిడి చేయడం భావ్యం కాదన్నారు. వారి బాధలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని పవన్ కోరారు. ఆర్థికంగా నష్టపోయి.. ఆ వాహనాల రుణాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉండగా.. ఈ నెలాఖరులోగా పన్నులు, రుసుములు అంటూ రాష్ట్ర రవాణా శాఖ చెప్పడంతో ట్యాక్సీల యజమానులు ఆందోళనకు లోనవుతూ ఉన్నారని పవన్ పేర్కొన్నారు.

తమ బాధలను జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారని, గత మూడు నెలలుగా వాహనాలు తిరగకపోవడంతో జీవనమే కష్టంగా మారిందనీ, ఇక పన్నులు ఎలా చెల్లించాలని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు పవన్ వెల్లడించారు. రోడ్లపై తిరగని వాహనాలకు లాక్ డౌన్ సమయంలో పర్మిట్ ఫీజు, రోడ్ టాక్స్ రద్దు చేయాలని, అలాగే సీట్ల కుదింపు ఉన్నంత వరకూ పన్నులలో 50శాతం రాయితీ ఇవ్వాలన్నారు. ప్రజా రవాణా రంగంలో భాగమైన మాక్సీ టాక్సీ క్యాబ్స్ యజమానులు, వాటిపై ఆధారపడ్డ డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Tags :
|
|

Advertisement