- హోమ్›
- వార్తలు›
- 30 శాతం మందికి మాత్రమే అనుమతి ... ట్రిపుల్ ఐటీ మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
30 శాతం మందికి మాత్రమే అనుమతి ... ట్రిపుల్ ఐటీ మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
By: Sankar Sun, 08 Nov 2020 07:38 AM
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల నిర్వహణపై రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ(ఆర్జీయూకేటీ) శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
కోవిడ్–19 నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం బ్లెండెడ్ లెర్నింగ్(ఆన్లైన్, ఆఫ్లైన్) విధానంలో కొనసాగనుంది. తరగతిలో బోధన(ఆఫ్ లైన్)కు 30 శాతం మంది విద్యార్థులను అనుమతిస్తారు. మిగతా 70 శాతం మందికి ఆన్లైన్లో బోధిస్తారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం క్యాంపస్లను నిర్వహించాల్సి ఉంటుంది.
మొదటి సెమిస్టర్లో బ్లెండెడ్ లెర్నింగ్ విధానాన్ని బోధన–అభ్యాస వ్యూహంగా అనుసరిస్తారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 30 శాతం మందిని క్యాంపస్లోకి అనుమతిస్తారు. మిగిలిన వారికి ఆన్లైన్ బోధన ఉంటుంది. ఆర్జీయూకేటీ నాలుగు క్యాంపస్లలో నవంబర్ 2 నుంచి పీయూసీ–2, ఈ–2, ఈ–3, ఈ–4కు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చారు.
2019–20 పీయూసీ–2 బ్యాచ్ ప్రస్తుతం క్యాంపస్లలో జరిగే సెమిస్టర్–2కు సంబంధించిన పరీక్షలకు హాజరవ్వాలి. వీటి ఫలితాల ఆధారంగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో వారికి ప్రవేశాలు జరుపుతారు. ఇక 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ ముగింపు పరీక్షలు 2021 మార్చి చివర్లో జరుగుతాయి.