ఏపీ ప్రభుత్వ గొప్ప నిర్ణయం ..అనాథలు , ట్రాన్సజెండర్లకు రైస్ కార్డులు
By: Sankar Wed, 16 Sept 2020 2:33 PM
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వివక్షకు గురవుతూ ఒంటరిగా జీవిస్తున్న ట్రాన్స్ జెండర్లకు అండగా నిలిచేందుకు సిద్ధమౌతోంది. వారి ఆకలి తీర్చేందుకు రైస్ కార్డులను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వలంటీర్ల సహాయంతో వారిని గుర్తించనుంది.
ఇప్పటికే అనాథలు, ట్రాన్స్జెండర్లు, పిల్లలు లేని వితంతువులు, ఇల్లులేని వారిని గుర్తించాలని అధికారులు వాలంటీర్లను ఆదేశించారు. గుర్తించిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ రైస్ కార్డు మాదిరిగానే ఆరు అంశాల ప్రాతిపదికన అర్హత ఉంటే సరిపోతుంది. 10 రోజుల్లో కొత్త రైస్ కార్డును అందజేస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో 5 వేల మంది కొత్తగా రైస్ కార్డు పొందే అవకాశం ఉంది. ఇక రైస్ కార్డులు తీసుకున్నవారు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు అవ్వనున్నారు.
ఏ సంక్షేమ పథకానికైనా అర్హత ఉండాలంటే ముఖ్యంగా రైస్ కార్డు ఉండాలి. ఆ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అనాథలు, ఒంటరిలు, ట్రాన్స్జెండర్లు దూరం కావాల్సి వస్తోంది. దీంతో కార్డు పొందేందుకు వారు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోవాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. ప్రభుత్వమే అర్హులైన వారిని గుర్తించి రైస్ కార్డులు ఇస్తుండటంతో సంక్షేమ పథకాలకు అర్హత పొందనున్నారు.
ఒంటరిగా జీవించే వారికి చేయూత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ డిమాండ్ ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మానవత్వంతో ఆలోచించి ఒంటరి బతుకులకు అండగా నిలవాలని నిర్ణయించడం అభినందనీయం. ఈ నిర్ణయంతో పలువురి ఒంటరి బతుకుల్లో వెలుగులు నిండనున్నాయి.