జిల్లాకొక కరోనా కంట్రోల్ రూమ్ ..జగన్ సర్కార్ కీలక నిర్ణయం
By: Sankar Mon, 20 July 2020 10:30 AM
ఏపీలో కరోనా కేసులు అనూహ్యంగా భారీగా పెరుగుతున్నాయి ..వారం క్రితం వరకు కూడా ఒక్క రోజు కేసులు వెయ్యికి మించకపోయేవి ..కానీ గత వారం నుంచి కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి ..గడిచిన 24 గంటల్లో అయితే అయిదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో ప్రజలు అందరు తీవ్ర ఆందోళనలో ఉన్నారు..జగన్ సర్కార్ ముందు నుంచే కరోనా టెస్టులు ఎక్కువ చేస్తున్నప్పటికీ ఏరోజు కూడా ఇన్ని కేసులు నమోదు కాలేదు ..దీనితో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది ..కరోనా గురించి పూర్తి సమాచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కోవిడ్ కంట్రోల్ రూంలు అందుబాటులోకి తెస్తోంది.
ప్రస్తుతం 104 కాల్ సెంటర్ ఉండగా కొత్తగా జిల్లా కేంద్రానికి ఒకటి చొప్పున 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తారు. మూడు షిఫ్టుల్లో షిఫ్ట్కు ఐదుగురు చొప్పున సిబ్బంది పనిచేస్తారు. ఇక్కడ జిల్లా పరిధిలోని కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రుల సమాచారం ఇస్తారు. టెస్టుకు వెళ్లిన వారి ఫలితాల సమాచారమిస్తారు. బాధితులు ఎక్కడ, ఏ ఆస్పత్రిలో చికిత్స పొందాలో సూచిస్తారు. కోవిడ్ కేర్లోగానీ, ఆస్పత్రిలోగానీ చేర్చుకోకుంటే వెంటనే ఫిర్యాదు స్వీకరించి అధికారులకు తెలియజేస్తారు.
పాజిటివ్ పేషెంట్లకు సంబంధించి ఇంటి నుంచి ఫోన్ చేసినా బాధితులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని చేరవేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విజయవాడలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఉండగా ఇకపై ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎప్పుడు ఫోన్ చేసినా కరోనాకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా తెలియచేసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.