షిప్ యార్డ్ ప్రమాద మృతులకు యాబై లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
By: Sankar Sun, 02 Aug 2020 3:44 PM
విశాఖ షిప్యార్డ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ప్రకటించింది ఏపీ రాష్ర్ట ప్రభుత్వం. ఆ రాష్ర్ట మంత్రి అవంతి శ్రీనివాస్ రావు షిప్యార్డులోని ప్రమాదస్థలాన్ని నేడు పరిశీలించారు. షిప్యార్డు యాజమాన్యం, కాంట్రాక్ట్ సంస్థలతో మంత్రి సమావేశమై చర్చించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... విశాఖ షిప్యార్డ్ మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించారు. షిప్యార్డు ప్రమాదం దురదృష్టకరమన్న మంత్రి ఘటనపై కొందరు నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్తాన్ షిప్యార్డులో శనివారం ఉదయం 11.50 గంటలకు భారీ క్రేన్ కుప్పకూలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది విగతజీవులుగా మారారు. 70 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్ శిథిలాల కింద చిక్కుకుని వీరంతా మృతిచెందారు.