రేపే ఏపీ ఎంసెట్ ...విద్యార్థులు పాటించాల్సిన నియమాలు ఇవే
By: Sankar Wed, 16 Sept 2020 11:20 AM
ఏపీలో ఎంసెట్ పరీక్షలు రేపటి (సెప్టెంబర్17) నుంచి ప్రారంభం కానున్నాయి. 25వ తేదీ వరకు అంటే.. ఏడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో మొత్తం 14 సెషన్లుగా ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షకు ఈ ఏడాది 2,72,900 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇక కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నత విద్యామండలి ద్వారా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏపీ, హైదరాబాద్తో కలుపుకుని మొత్తం 47 ప్రాంతాల్లో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అడ్మిట్ కార్డులు/హాల్టికెట్లు కూడా విడుదల చేశారు. అత్యధిక మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారు..
విద్యార్థులు పాటించాల్సిన నియమాలు :
1. మొదటి సెషన్ ఉదయం గం.9-12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం గం.3-6 వరకు జరుగుతుంది.
2.గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిని ఇస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదు.
3. ఈ–హాల్ టికెట్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని అభ్యర్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని నింపి సమర్పించాలి.
4. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది.
5. హాల్ టికెట్తో పాటు మరో అధికారిక ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి.
6. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటకు పంపరు.
7. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కచ్చితంగా మాస్క్, చేతి గ్లోవ్స్ ధరించాలి.
8. 50 ఎంఎల్ శానిటైజర్, పారదర్శకంగా ఉండే వాటర్ బాటిళ్లను లోపలకు అనుమతిస్తారు.
9.కరోనా లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షకు అనుమతిస్తారు.