కెసిఆర్ కి గట్టిగా సమాధానమిచ్చిన జగన్
By: Dimple Wed, 12 Aug 2020 01:20 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నదీ జలాల వివాదాలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ ఇటీవలే కేసీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో సీఎం జగన్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ కేటాయింపులఆధారంగానే తాము ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమేనని తేల్చి చెప్పారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని సీఎం జగన్ తెలిపారు.అలాగే తెలంగాణ ప్రభుత్వంపై సైతం ఈ సందర్భంగా సీఎం జగన్ విమర్శలు చేశారు. కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్లు చేపడుతోందని సీఎం జగన్ ఆరోపించారు. కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్లకు సంబంధించి.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైనట్లు ఆయన లేఖలో తెలిపారు. ఆ రెండు ప్రాజెక్ట్లు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయన్నారు.
మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామని తెలంగాణ చెప్పిందని సీఎం జగన్ గుర్తు చేశారు. కానీ తర్వాత మాట మార్చి పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ తెలంగాణను ఆదేశించలేదన్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించినట్లు తెలిపారు. కానీ, రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగకుండా ఆగిపోయిందని లేఖలో సీఎం జగన్ తెలిపారు.