విద్య వికాసానికి దారి తీయాలి తప్ప ఒత్తిడిలోకి నెట్టివేయొద్దు ...ఏపీ సీఎం జగన్
By: Sankar Tue, 03 Nov 2020 06:28 AM
కరోనాతో వృథా అయిన కాలాన్ని భర్తీచేసే విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. విద్య అన్నది వికాసానికి దారితీయాలే తప్ప ఒత్తిడితో సతమతమయ్యే పరిస్థితి ఉండకూడదన్నారు. యూజీసీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు ఆయన సూచించారు.
అలాగే, ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఉన్నత విద్యపై సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ వర్సిటీల్లో 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద, మిగిలిన 50 శాతం సీట్లు వర్సిటీ కోటా కింద ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం కన్వీనర్ కోటాలో పేద పిల్లలకు సీట్లు వస్తాయని, వారికి ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఫీజులు చెల్లిస్తుందని సీఎం జగన్ స్పష్టంచేశారు.
వర్సిటీలకు ఎన్బీఏ, ఎన్ఏసీ–నాక్ గుర్తింపు కూడా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ క్లాసులు, యూనివర్సిటీల్లో ప్రమాణాలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, కోర్సుల ఇంటిగ్రేషన్.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్లు అంశాలపై సీఎం సూచనలు చేశారు.