ఏపీ, తెలంగాణ జల వివాదం ఫై రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కాస్త గట్టిగానే జరిగిన వాదనలు..
By: chandrasekar Wed, 07 Oct 2020 6:57 PM
ఏపీ, తెలంగాణ
మధ్య ఉన్న జల వివాదం గురించి మంగళవారం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఢిల్లీ నుంచి ఏపీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జల
వివాదంపై రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. కాస్త వాడీవేడిగా జరిగిన
సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కాస్త గట్టిగానే వాదనలు జరిగినట్లు
సమాచారం.
సమావేశంలో భాగంగా
కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతులు లేవని ఏపీ సీఎం జగన్ అన్నారు. అయితే
ఆయన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారని తెలుస్తోంది. ఏపీ
చేపట్టాలనుకుంటున్న పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుకు అసలు ఏ అనుమతులూ లేవని
సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాక మొదటి ప్రాజెక్టుకే అనుమతి
లేనప్పుడు రెండోది ఎలా చేపడతారని కేసీఆర్ ఆగ్రహించినట్లు సమాచారం. ఇలా
కేసీఆర్-జగన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకొన్న
కేంద్ర మంత్రి షెకావత్ ఇద్దరికీ సర్దిచెప్పినట్లు సమాచారం. అనంతరం డీపీఆర్లు
సమర్పిస్తే కేంద్రం అన్ని ప్రాజెక్ట్లపై నిర్ణయం తీసుకుంటుందని సమావేశంలో షెకావత్
అన్నారు.
సమావేశం ముగిసిన అనంతరం
కేంద్రమంత్రి షెకావత్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు చెప్పారు. ఏపీ, తెలంగాణ
ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలు, ప్రాజెక్టుల నిర్వహణ, గోదావరి జలాలను సమర్థంగా
వాడుకోవడం, కృష్ణా బోర్డు తరలింపు లాంటి అంశాలపై సమావేశంలో
ప్రధానంగా చర్చ జరిగిందని షెకావత్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కొత్తగా తలపెట్టిన
ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ సమర్పించేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించినట్లు
ఆయన చెప్పారు. వాటిని పరిశీలించి అపెక్స్ కౌన్సిల్ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
దీనిపై తుది నిర్ణయం కౌన్సిల్దే అని తెలిపారు. జలాల వాటాలకు సంబంధించిన నిర్ణయాలు
నదీ బోర్డులే తీసుకుంటాయని స్పష్టం చేశారు. జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంలో
ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని షెకావత్ మీడియాకి
తెలిపారు.