139 మంది కాదు ..36 మంది ..షాకిచ్చిన అత్యాచార బాధితురాలు
By: Sankar Thu, 03 Sept 2020 4:52 PM
తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన మిర్యాలగూడకు చెందిన యువతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసి పోలీసుల శాఖను ముప్పుతిప్పలు పెట్టి.. రెండు రోజులకే మాట మార్చింది. ఆ తరువాత తనపై ఎవరూ అత్యాచారానికి పాల్పడలేదని రాజశేఖర్రెడ్డి అలియాస్ డాలర్ భాయ్ కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పేర్కొని కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
ఈ క్రమంలో గురువారం మరో ప్రకటన చేసింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని, 36 మంది మాత్రమే అత్యాచారం చేశారని పేర్కొంది. మొత్తం 53 మంది తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు తెలిపింది. డాలర్ బాయ్ తనను చిత్రహింసలకు గురిచేశాడని, తన బలవంతం మేరకే సెలబ్రిటీల పేర్లు చెప్పాల్సి వచ్చిందని వివరించింది.
తొలుత డాలర్ బాయ్ కంపెనీలో ఉద్యోగం నిమిత్తం వెళ్లానని, అప్పటి నుంచి తన గురించి తెల్సుకుని ఈ విధంగా వాడుకున్నాడని తెలిపింది. డాలర్ బాయ్ తన మీద అనేక రకాలుగా చిత్రహింసలకు పాల్పడ్డాడని, 36 మంది అత్యాచారం చేయడం మాత్రం వాస్తవమని స్పష్టం చేసింది. అతనితో తనకు ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తం చేసింది.