కరోనా కేంద్రం ఉద్యోగితో పాటు మరో నలుగురు బాలికపై లైంగికదాడి...
By: chandrasekar Tue, 08 Dec 2020 3:52 PM
కరోనాతో గురైన తల్లికి
సహాయంగా ఉండేందుకు కరోనా కేంద్రానికి వచ్చిన ఓ బాలికను అదే కేంద్రంలో పనిచేసే
ఉద్యోగి సహా మరో నలుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక
రాష్ట్రంలోని శివమొగ్గ నగరం శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రధాన
నిందితుడు మెక్గాన్ హాస్పిటల్లో కాంట్రాక్టు కార్మికుడు. ఇక్కడ 16 ఏండ్ల
బాలిక కరోనాకు గురైన తల్లికి సహాయంగా ఉండేందుకు గత 15
రోజులుగా మెక్గాన్ ఆసుపత్రికి వస్తున్నది. దాంతో ఆ బాలికకు సదరు నిందితుడు పరిచయం
అయ్యాడు. పరిచయం కాస్తా స్నేహంగా మారింది. శనివారం సాయంత్రం ప్రధాన నిందితుడు ఆ
బాలికను తనతో కలిసి కారులో విందు కోసం పోదామని కోరి విందు తర్వాత ఆసుపత్రిలో
దింపుతానని హామీ ఇచ్చాడు. దానికి అంగీకరించిన బాలిక నిందితుడు మరో తన ముగ్గురు
స్నేహితులతో కలిసి శివమొగ్గ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయనూరుకు తీసుకువెళ్ళారు.
హైవే సమీపంలో ఏకాంత ప్రదేశంలో కారును ఆపి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
అనంతరం ఆమెను ఆసుపత్రి వద్ద దింపేసి పారిపోయారు.
జరిగిన విషయాన్ని తల్లికి
చెప్పడంతో ఆమె తన బంధువులు, ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించింది. అనంతరం
పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన దొడ్డపేటే
పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలో పోలీసులు
ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగతా ఇద్దరిని గుర్తించేందుకు ప్రయత్నాలు
జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.