Advertisement

  • ఐపీఎల్ టోర్నీ అంతటా అద్భుతంగా ఆడిన జట్టుకు మరో అవకాశం

ఐపీఎల్ టోర్నీ అంతటా అద్భుతంగా ఆడిన జట్టుకు మరో అవకాశం

By: chandrasekar Tue, 03 Nov 2020 9:35 PM

ఐపీఎల్ టోర్నీ అంతటా అద్భుతంగా ఆడిన జట్టుకు మరో అవకాశం


ప్రపంచంలో అత్యంత విజయవంతమైన టీ20 క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్ గుర్తింపు పొందింది. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఆడే ఈ లీగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా బోలెడంత క్రేజ్ ఉంది. మిగతా లీగ్‌లెన్ని వచ్చినా అభిమానులను అలరించడంలో ఐపీఎల్ తర్వాతే ఏవైనా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని ఎందరో యువ ఆటగాళ్లు.. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ల నుంచి మెలకువలు నేర్చుకోగలుగుతున్నారు. సంప్రదాయ క్రికెట్లో కనిపించని ఎన్నో మార్పులు ఐపీఎల్‌లో కనిపిస్తుంటాయి. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, స్ట్రాటజిక్ టైమ్ ఔట్ తదితర కొత్త అంశాలను ఐపీఎల్‌లో ప్రవేశపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన కొత్తలో సెమీఫైనల్ విధానం ఉండేది. లీగ్ దశలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్ ఆడేవి. వీటిలో గెలిచిన జట్లు ఫైనల్ ఆడేవి. కానీ లీగ్ దశలో తిరుగులేని విజయాలు అందుకొని పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్‌లో ఓడితే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చేది.

దీంతో టోర్నీ అంతటా అద్భుతంగా ఆడిన జట్టుకు మరో అవకాశం కల్పించడం కోసం 2011 నుంచి ప్లేఆఫ్స్ విధానాన్ని తీసుకొచ్చారు. సెమీస్‌తో పోలిస్తే ప్లేఆఫ్‌లో ఓ మ్యాచ్ అదనంగా జరుగుతుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు తొలి సెమీస్‌లో ఆడతాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి వెళుతుంది. గెలిచిన జట్టు.. తొలి క్వాలిఫైయర్‌లో ఓడిన జట్టుతో మరో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. 2013లో ఫస్ట్ క్వాలిఫైయర్‌లో ఓడిన ముంబై ఎలిమినేటర్‌లో గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్లో చెన్నైపై విజయం సాధించి కప్‌‌ను దక్కించుకుంది. 2011, 2014ల్లో ఆర్సీబీ, పంజాబ్ ఇలాగే తొలి క్వాలిఫైయర్‌లో ఓడినప్పటికీ ఫైనల్ చేరాయి.

Tags :
|

Advertisement