గత 24 గంటల్లో ఆంధ్రాలో మరో 44 మందికి కరోనా పాజిటివ్
By: chandrasekar Mon, 25 May 2020 5:32 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మరో 44 మందికి కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో 10240
శాంపిళ్ళను పరీక్షించగా, ఇందులో
44 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర
వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో 41 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో
నమోదైన మొత్తం కరోనా కేసులు 2,671 అని
తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 767 మంది
చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు
1,848 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది.
దేశంలో కరోనా జోరుకు
ఏమాత్రం అడ్డూఅదుపు లేకుండా పోతోంది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఆయా
రాష్ట్రాల అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా గత 24 గంటల్లో ఏకంగా 6977 కేసులు
నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో దేశంలో 6,977
మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదేసమయంలో 154 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇకపోతే, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,38,845కి చేరగా, మృతుల
సంఖ్య 4,021కి చేరుకుంది. 77,103 మందికి
ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కరోనా నుంచి ఇప్పటివరకు 57,720 మంది కోలుకున్నారు.