ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం అలాగే మరణాలు కూడా భారీగా తగ్గుముఖం
By: chandrasekar Thu, 24 Sept 2020 10:11 AM
ఆంధ్ర రాష్ట్రంలో కరోనా
కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి అలాగే మరణాలు కూడా భారీగా తగ్గుముఖం పట్టినట్లు
తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు
కనిపిస్తోంది. బుధవారం మళ్లీ కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే గత కొన్ని
రోజులుగా 10 వేలకు పైగా డిశ్చార్జి అవుతుండగా, బుధవారం
తక్కువగా నమోదయ్యాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కరోనా వైరస్ మహమ్మారి
విలయతాండవం చేస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు
నమోదవుతున్నాయి.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య
శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 72,838 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7,228
మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్
కేసులు 6,46,530కు చేరుకున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు భారీగా తగ్గుముఖం
పట్టాయి. కొన్నాళ్ల క్రితం ప్రతి రోజూ 90కి పైగా నమోదైన కరోనా మరణాలు.. గత 10
రోజులుగా 50కి పడిపోయాయి. తాజాగా, బుధవారం కరోనా బారినపడి 45 మంది
మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,506కు
చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో
కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో ఏడుగురు, ప్రకాశంలో
ఏడుగురు, కృష్ణాలో
ఐదుగురు, తూర్పు
గోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, అనంతపురంలో
ముగ్గురు, కడపలో
ముగ్గురు, నెల్లూరులో
ముగ్గురు, గుంటూరులో
ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, శ్రీకాకులంలో ఒకరు మృత్యువాత పడ్డారు. అలాగే గత
కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా ఏపీలో భారీగా పెరుగుతున్నాయి. అయితే బుధవారం ఆ
సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా, బుధవారం 8,291 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి
అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 6,46,530 పాజిటివ్ కేసులకు గాను, 5,70,667 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 70,357 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక
తూర్పు, పశ్చిమ
గోదావరి జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. ఈ రెండు జిల్లాల్లో
కలిసి లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 90,047 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 60,659 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. మిగిలిన చోట వైరస్ ప్రబలడం తగ్గు ముఖం
పట్టినట్లు కనిపిస్తుంది.