ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,34,940కు చేరిన కరోనా కేసులు...మరణాల సంఖ్య 3,092
By: chandrasekar Sat, 22 Aug 2020 01:06 AM
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ కేసులతో పాటు, మరణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24
గంటల్లో 55,010 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,544 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య
3,34,940కు చేరింది. కరోనా వైరస్ మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. గడిచిన 24
గంటల్లో ఏకంగా 91
మంది కరోనా మహమ్మారి వల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,092కు పెరిగింది.
ఇక, కరోనా బారిన పడి గడిచిన 24
గంటల్లో చిత్తూరు జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరిలో 13
మంది, నెల్లూరులో 12
మంది, తూర్పు గోదావరిలో 11 మంది, అనంతపురంలో 8 మంది, కడపలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
శుక్రవారం 8,827 మంది కరోనా మహమ్మారిని సంపూర్ణంగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 3,34,940 పాజిటివ్ కేసులకు గాను,
2,44,045 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 87,803 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా
46,668 గా నమోదయ్యాయి.