ఆంధ్ర ప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా
By: chandrasekar Fri, 23 Oct 2020 09:42 AM
కోర్టు ఆదేశాల మేరకు
ఆంధ్ర ప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు ఆదేశాల
మేరకు 2018 గ్రూప్-1 మెయిన్స్
పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వచ్చే నెల 2 నంచి 13వ తేదీ
వరకు పరీక్షలు నిర్వహించేలా గతంలో షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ను ఈ నెల 29న ప్రకటిస్తామన్న
ఏపీపీఎస్సీ పేర్కొంది.
కాగా గ్రూప్ -1
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్లో లోపాలున్నాయని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మరొక
జాబితాను విడుదల చేయాలని లేకపోతే మెయిన్స్లో తాము నష్టపోతామన్న అభ్యర్థుల
వాదనను హైకోర్టు అంగీకరించింది. అడ్వకేట్ బొద్దులూరి శ్రీనివాస్, భరత్
చంద్రలు ఈ విషయమై రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
అభ్యర్థుల తరపున సీనియర్
న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు దొర్లడం వల్ల తెలుగు
మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అంతకుముందు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీపీఎస్సీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మంగళవారం కూడా వాదనలు జరిగాయి. ఇక గురువారం రోజున వాదనలు ముగిశాయి.దీంతో పరీక్షలు
వాయిదా పడ్డాయి.