అనంతపురం సీఐ కరోనాతో మృతి...ఎంపీ గోరంట్ల దిగ్భ్రాంతి
By: chandrasekar Wed, 15 July 2020 11:28 AM
ఏపీలో కరోనా వైరస్ మరణాలు
ఒక్కసారిగా పెరుగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే కరోనా
బారినపడి దాదాపు 80 మంది మరణించారు. తాజాగా, అనంతపురం
నగరంలో ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం
మృతి చెందారు.
అనంతపురంలోని స్థానిక
సవేరా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. కరోనా బారినపడి సీఐ మృతి చెందడం పట్ల హిందూపురం
వైఎస్సార్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు
శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన
కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ
భరోసా ఇచ్చారు.
ఏపీని కరోనా వైరస్ వణికిస్తూనే
ఉంది. మంగళవారం బులిటెన్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24
గంటల్లో 22,670 శాంపిల్స్ పరీక్షించగా మరో 1908 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి
వచ్చిన వారికి 8 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసులు 1916కు
చేరాయి. ఇక కరోనా బారిన పడి గడచిన 24 గంటల్లో ఏకంగా 43 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 408కి
చేరింది. రాష్ట్రంలో 17,467 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 15144 మంది
వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనంతపురం జిల్లాలో కరోనా చాలా వేగంగా
వ్యాప్తి చెందుతూ ఉంది.
మంగళవారం రాష్ట్ర ఆరోగ్య
శాఖ విడుదలచేసిన బులెటిన్ ప్రకారం అనంతపురం జిల్లాలో గత 24
గంటలలో 10 మంది
చనిపోయారు. 185 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 3,651
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,456 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు
మొత్తం 40 మంది
చనిపోయారు. మృతులకు సంబంధించి అనంతపురం జిల్లా మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానం 108
మరణాలతో కర్నూలు జిల్లాది కాగా, కృష్ణా జిల్లా 83 మరణాలతో రెండో స్థానంలో ఉంది.