Advertisement

బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన

By: chandrasekar Thu, 15 Oct 2020 12:09 PM

బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన


RR vs DC జట్ల మధ్య బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఉతప్ప ఫీల్డర్లకు ఆటంకం కలిగించినా తెలివిగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ బౌలర్ తుషార్ దేశ్‌పాండే తన రెండో ఓవర్ రెండో బంతికి స్టోక్స్‌ను ఔట్ చేశాడు. దీంతో స్టోక్స్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాబిన్ ఉతప్ప అదే ఓవర్లో మిడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడి అనవసరమైన సింగిల్ కోసం ముందుకు పరిగెత్తుకొచ్చాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సంజూ శాంసన్ వారించడంతో అప్పటికే చాలా దూరం వచ్చేసిన ఉతప్ప మళ్లీ వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కానీ కొద్ది దూరం పరిగెత్తాక తన డైరెక్షన్ మార్చుకున్నాడు.

దీంతో రనౌట్ చేయడం కోసం ఫీల్డర్ శిఖర్ ధావన్ వికెట్లకు విసిరిన బంతి ఉతప్పకు తగలడంతో ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించాడనే కారణంతో ఢిల్లీ ఆటగాళ్లు ఔట్ కోసం అప్పీల్ చేశారు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ ధావన్ బంతిని విసరడానికి ముందే ఉతప్ప తన డైరెక్షన్ మార్చుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ఉతప్ప నాటౌట్ అని ప్రకటించారు. అదే ఫీల్డర్ బంతిని చేతిలో నుంచి విసిరిన తర్వాత డైరెక్షన్ మార్చుకొని ఉండుంటే ఉతప్ప పరుగులేమీ చేయకుండానే ఔటయ్యేవాడు. 27 బంతుల్లో 32 రన్స్ చేసిన ఉతప్ప నోర్జే వేసిన బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Tags :
|

Advertisement