అమరావతి భూకుంభకోణం వ్యవహారం మళ్లీ ప్రకంపనలు
By: chandrasekar Wed, 16 Sept 2020 5:07 PM
ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డిఫై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రకటన
తర్వాతే భూములు కొన్నట్లయితే సీఎం జగన్ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో
చేర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అయ్యన్నపాత్రుడు ట్వీట్
చేశారు. ‘‘ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు
పెట్టడం ఏసీబి మర్చిపోయినట్లు ఉంది. అమరావతిలో జగన్ రెడ్డి గారు ఇళ్ళు కట్టింది
కూడా అమరావతి ప్రకటన తరువాతే. ప్రకటన వచ్చిన తరువాత కొన్నవి ఇన్ సైడర్ ట్రేడింగ్
అంటే జగన్ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్కు
పాల్పడినట్టే.’’ అని అయ్యన్నపాత్రుడు కొత్త చర్చ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో
అమరావతి భూకుంభకోణం వ్యవహారం మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. అమరావతి భూ కుంభకోణంలో
ఏసీబీ దూకుడు పెంచింది.
ఇన్సైడర్ ట్రేడింగ్
ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది.
రాజధాని విషయం ముందే తెలుసుకుని ఎవరెవరు భూములు కొన్నారనే కోణంలో దర్యాప్తు
చేస్తోంది. రాజధాని ప్రకటనకు ముందే కొందరు ప్రముఖులు భూములు కొనుగోలు చేసినట్లు
ఆరోపణలు ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారిలో
పలువురు ప్రముఖులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మరికొందరు ఉన్నట్లు ఏసీబీ
గుర్తించినట్లు తెలుస్తోంది. కొంతమంది బినామీల పేరుతో భూముల్ని కొనుగోలు చేసినట్లు
ప్రాథమికంగా తేల్చారట.