ఢిల్లీ విధానాన్ని అనుసరిస్తున్న అమెరికా
By: Dimple Tue, 25 Aug 2020 00:19 AM
దిల్లీ అనుసరించిన విధానాన్నే అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా రోగులకు ప్లాస్మా వైద్యం అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదం తెలపడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీ నిన్న చేసిందే, ఈ రోజు అమెరికా చేస్తోందని పేర్కొన్నారు.
‘‘గతంలో అమెరికా ఏం చేస్తే దాన్నే భారత్ రేపటి రోజున అనుసరిస్తుందని చెప్పేవారు. కానీ దిల్లీ దానిని మార్చేసింది. ప్రస్తుతం దిల్లీ నిన్న ఏం చేసిందో దానినే అమెరికా ఈ రోజు చేస్తోంది. మన దేశం కోసం దీనిని సాధించిన దిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు’’ అని ట్వీట్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దానితో పాటు ట్రంప్ ప్రకటనను ట్వీట్కు జతచేశారు.గత నెలలో కేజ్రీవాల్ దిల్లీలో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంక్ను ప్రారంభించారు.
ఇప్పటి వరకు దిల్లీలో 700 మందికి ప్లాస్మా చికిత్స అందించినట్లు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బ్లడ్ ప్లాస్మా థెరపీకి అమెరికా ఎఫ్డీఏ ఆదివారం అనుమతులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
‘‘చాలా కాలంగా నేను దీని కోసమే ఎదురు చూస్తున్నాను. కరోనాపై పోరులో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. వైరస్ బారి నుంచి ఎంతో మంది ప్రాణాలను ఇది కాపాడుతుంది’’ అని వైట్హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.