ఆరు కిలోమీటర్ల దూరానికి అంబులెన్సు ఛార్జ్ తొమ్మిది వేల రూపాయలు..
By: Sankar Sun, 26 July 2020 12:25 PM
కరోనా మహమ్మారి అంబులెన్స్ యజమానులకు కాసులవర్షం కురిపిస్తోంది. కరోనా రోగులను తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు అత్యధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరానికి 10వేలకు పైగానే ఛార్జీలు తీసుకుంటున్నారు.
తాజాగా కోల్కతా నగరంలో 6 కి.మీ. దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కోవిడ్-19 పేషెంట్ల నుంచి రూ.9,200 డిమాండ్ చేశాడు డ్రైవర్. ఆఖరికి వైద్యుల జోక్యంతో డ్రైవర్ రూ.2వేలు తీసుకునేందుకు అంగీకరించాడు.
ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు..వారిలో ఒకరిది తొమ్మిది నెలల వయసుగా కాగా మరొకరి వయసు తొమ్మిదిన్నర ఏండ్లు. ఇద్దరూ కూడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం వీరిద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు బాలుర తండ్రి అంబులెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. కోల్కతా మెడికల్ కాలేజ్కు వెళ్లేందుకు 6 కిలోమీటర్ల ప్రయాణానికి అంబులెన్స్ డ్రైవర్ 9,200 డిమాండ్ చేశాడని బాలుర తండ్రి వాపోయాడు.