ఆంధ్ర తరుపున రాయుడు ,పంజాబ్ తరుపున యువీ ..దేశవాళీ క్రికెట్లో స్టార్ ఆటగాళ్లు
By: Sankar Wed, 16 Dec 2020 2:13 PM
దేశవాళీ క్రికెట్లో ఆంధ్రా జట్టు తరఫున ఆడేందుకు భారత సీనియర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)తో తీవ్ర విభేదాల కారణంగా గతేడాది జట్టును వీడగా.. ఆంధ్రాకు వెళ్లేందుకు బీసీసీఐ అతడికి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇచ్చినట్టు బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
కరోనా వైరస్ విజృంభణ తర్వాత బీసీసీఐ నిర్వహించనున్న తొలి దేశవాశీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున రాయుడు బరిలోకి దిగనున్నట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో ఆంధ్రా క్రికెట్ సంఘం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇక మరోవైపు గతేడాది జూన్లో క్రికెట్కు వీడ్కోలు పలికిన యువీ.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడనున్నాడు. ఈ టోర్నీ కోసం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ) ప్రకటించిన 30 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్ జాబితాలో యువరాజ్ పేరు కూడా ఉంది. మళ్లీ ఆటను ప్రారంభించాలన్న అభిప్రాయాన్ని యువీ తమకు తెలిపాడని పీసీఏ కార్యదర్శి పునీత్ బాలీ వెల్లడించారు.