హైకోర్టులో అమరావతిపై విచారణ నవంబర్ 2కు వాయిదా
By: chandrasekar Mon, 12 Oct 2020 5:54 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో
అమరావతిపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను
అత్యున్నత న్యాయ స్థానం నవంబర్ 2కు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు
చేసిన అంతర్గత పిటిషన్పై సోమవారం విచారణ పూర్తి చేసింది. వైజాగ్లో నిర్మించే గెస్ట్ హౌస్ను రాజధానిలో
భాగంగా కడుతున్నారా అని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో గెస్ట్హౌస్లకు సంబంధించిన పూర్తి వివరాలు
అఫిడవిట్లో పొందుపర్చలేదని న్యాయవాది గుప్తా ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
విశాఖపట్నంలో ఎంత విస్తీర్ణంలో, ఎన్ని గదులు నిర్మిస్తారన్నది స్పష్టం చేయలేదని
తెలిపారు. ప్రభుత్వ నిర్మాణాలకు తమకెటువంటి అభ్యంతరం లేదు గాని ప్రభుత్వం
నిర్మించబోయే గెస్ట్హౌస్లు చాలా విశాలమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారని
దానివల్లే అనుమానాలు రేకెత్తుతున్నాయని పేర్కొన్నారు.
తాత్కాలికంగా సీఎం
క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని
పిటిషనర్ తరపు న్యాయవాది గుప్తా కోర్టుకు తెలిపారు. రాజధానిలో భాగంగా వైజాగ్లో
గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడం లేదని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు
తెలిపారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలో అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి
వస్తుందన్న కారణంతోనే గెస్ట్ హౌస్ నిర్మాణాలను చేపట్టామని పేర్కొన్నారు. జనాభా
దామాషా ప్రాతిపదికన గెస్ట్హౌస్ నిర్మాణాలు చేపడుతున్నామని ధర్మాసనానికి ప్రభుత్వం
తరపున అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 2కు
వాయిదా వేసింది.